Online Puja Services

శివుణ్ణి, రోగాలని నివారించేందుకు యముడు తెచ్చారట

18.116.90.141

తల్లకిందులుగా తపస్సు చేసే శివుణ్ణి, రోగాలని నివారించేందుకు యముడు తెచ్చారట ! 
లక్ష్మీ రమణ 

భీమవరం పేరు చెప్పగానే, గోదారమ్మ పరవళ్లు , పచ్చని ప్రక్రుతి అందాలు, ధీర గంభీరమైన భీమేశ్వర క్షేత్రం గుర్తొచ్చేస్తాయి. మావుళ్ళమ్మ కళ్ళముందు మెదిలి భక్తిగా మనసు చేసే నమస్కారాన్ని స్వీకరించినట్టు అనుభవమవుతుంది . కానీ , భీమవరం పట్టణానికి 5 కి.మీ. ల దూరంలో ఉన్న సర్వ రోగ నివారిణి అయిన త్రేతాయుగం నాటి  శైవక్షేత్రం గురించి తెలిసిన వారు తక్కువ . 

 భీమేశ్వరానికి అతిదగ్గరలోనే ఉంది యనమదుర్రు గ్రామం. వంద ఏళ్ళ క్రితంవరకు ఇక్కడ కొలువన ఈశ్వరుని గురించి తెలిసినవారు తక్కువ . ఈ ఆలయం గురించి ఎవరికీ తెలియదు. వంద ఏళ్ళ క్రితం జరిపిన త్రవ్వకాలలో త్రేతాయుగంనాటి ఈ ఆలయం బయటపడింది.

ఆది దంపతులు ఒకే శరీరాన్ని పంచుకున్నవారు . ఈ ఆలయంలో ఒకే పీఠంపై నెలకొని దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు మూడేళ్ళ బాలుడైన సుబ్రహ్మణ్యున్ని లాలిస్తూ మాతృ స్వరూపిణిగా దర్శనమిస్తారు . శివుడు శీర్షానంలో, యోగ నిమగ్నుడై దర్శనమిస్తారు . ఈ రూపాలలో , ఇటువంటి భంగిమలో ఉన్న ఆదిదంపతులని మారె క్షేత్రంలోనూ దర్శించలేమనుకుంటా ! 

ఇక్కడి ఈశ్వరుణ్ణి శక్తీశ్వరుడు అని పిలుస్తారు .  ఈయన ప్రత్యేకత ఆయన  భంగిమలోనే ఉంది .  సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలెయ్యటమేకాక సాకార రూపంలో కూడా వైవిధ్యం చూపించాడు పరమేశ్వరుడు. శివుని జటాజూటం భూమికి తగులుతుంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు కనిపిస్తాయి. ధారాపాత్ర నుండీ అభిషేకం ఆయన శిరస్సుకి కాకుండా పాదాలకి జరుగుతుంటుంది . యోగనిమగ్నుడై, అమృత భంగిమలో ఉంటారు కాబట్టి , ఆయన సర్వరోగ నివారకుడు అని చెబుతారు .  ఈ స్థల ఐతిహ్యం కూడా ఇటువంటి కథనే వినిపిస్తుంది . 

యమధర్మరాజుకి ఒకసారి తను చేసే పని మీద విసుగు వచ్చిందిట. ఎంతసేపూ జీవుల పాపపుణ్యాలు లెక్కించడం, వాళ్లకి శిక్షలు విధించడం, వధించడం చాలా బోరింగ్ విషయమే కదా ! పైగా గొప్ప వైలెంట్ కార్యక్రమం కూడా !  పైగా ప్రజలంతా ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారు. ఆ విరక్తితోటె, శివుని కోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేశారట .

 శివుడు ప్రత్యక్షమై భవిష్యత్తులో యమధర్మరాజు ఒక రాక్షసుడిని సంహరిస్తారని , ఆ  తర్వాత తాము ఇక్కడ నిలుస్తామని , తమని దర్శించిన వారికి దీర్ఘరోగాలు వుంటే సత్వరం నయమవుతాయని, ఆరోగ్యంగా వుంటారనీ, తద్వారా యముడంటే ప్రాణాలు తీసేవాడేకాదు, దీర్ఘకాల రోగాలను నయంచేయగలవాడు కూడా అని ప్రజలచేత కొనియాడబడతాడు అని వరమిచ్చారు .
 
యముడు సంహరించిన ఆ రాక్షసుని వృత్తాంతం ఇలా ఉంది . పూర్వం ఈ ప్రాంతం పేరు యమునాపురం. ఇక్కడ శంబిరుడనే రాక్షసుడుండేవాడు. శంబిరుడు తపస్సు చేసుకుంటున్న మునులను హింసిస్తూ పలు అకృత్యాలకు పాల్పడేవాడు. ఆ మునులు ఇవ్వన్నీ పడలేక యమధర్మరాజు దగ్గరకెళ్ళి వాణ్ణి చంపెయ్యమని మొరబెట్టుకున్నారు. యముడు కూడా మునులను రక్షించడానికి ఆ రాక్షసుడిని చంపటానికి చాలా ప్రయత్నం చేసి, అతని చేతిలో చాలా సార్లు ఓడిపోయాడు. 

అప్పుడు శివుని కోసం తిరిగి  తపస్సు చేశాడు. శివుడు ఆ సమయంలో యోగనిష్టలో వుండటంతో ప్రత్యక్షంకాలేదు. పార్వతీదేవి యముని తపస్సుకి మెచ్చి, తనలోని శక్తి అంశను యమునికిచ్చి శంబరుని వధించేటట్లు చేస్తుంది. తన విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి యమపురి అని నామకరణం చేశాడు యమధర్మరాజు. అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఉప్పొంగిపోయి, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించటానికి వీలులేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా అక్కడ వెలియమని కోరాడు. యముని కోరికమేరకు బాలింతరాలైన పార్వతీదేవి తన మూడు నెలల పసిబిడ్డతో, యోగనిష్టలో వున్న ఈశ్వరుడితో సహా ఇక్కడ సాక్షాత్కరించింది. దీనికి ఆధారంగా ఈ జిల్లాలో నరసాపురం తాలూకాలోని శంబరీవి అనే ద్వీపాన్ని చెప్తారు. ఈ శంబరుడు శ్రీరామచంద్రుడు పరిపాలించిన త్రేతాయుగంనాటివాడు. అందుకనే ఈ ఆలయం త్రేతాయుగంనాటిదిగా ప్రసిధ్ధికెక్కింది.
 
ఆలయానికి ఎదురుగా శక్తికుండము అనే మంచినీటి సరస్సు వుంది. స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికీ ఈ నీటినే వినియోగిస్తారు. ఒకసారి చెరువుచుట్టూ ప్రాకారం నిర్మించాలని చెరువుని ఎండబెట్టారుట. ఆ సమయంలో స్వామివారి నైవేద్యంకోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం వుడకలేదుట. అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులో గుంట త్రవ్వగా నీరు వచ్చిందిట. ఆ నీటిని పోసి వండగా ప్రసాదం వెంటనే వుడికిందట. అప్పటినుంచీ స్వామి నైవేద్యానికి వేరే నీరు వాడరు. ఈ శక్తికుండములోని నీరు మామూలు నీరు కాదు. కాశీలోని గంగానదిలోని ఒక పాయ అంతర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తున్నదని జియాలజిస్టులు చెప్పారంటారు. అందుకే ఈ సరస్సు గంగానదితో సమానమైనదంటారు.
 
దక్షిణకాశీగా పిలవబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి. అంటే సర్పం. ఈ ఆలయానికి, చెరువుకు కాపలాగా రెండు నాగుపాములు ఇప్పటికీ ఉంటాయట . ఉదయం బ్రహ్మముహూర్తంలో ఈ నాగుపాములు చెరువులో వలయాకారంగా మూడుసార్లు తిరిగి, స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకెళ్ళిపోవటం చూసినవారున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రాంగణంలో రెండు నాగుపాము లు ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకుని దర్శనమిస్తాయట . అయితే అవి ఎవరినీ ఏమీ చేయవు.

ఆలయ తూర్పు ద్వారానికి ప్రక్కగా వున్న నందీశ్వరుని మూతి, ఒక కాలు విరిగి వుంటాయి. తురుష్కులు ఈ ఆలయం మీద దాడి చేసినప్పుడు వారి ప్రభువు తన కరవాలం పదును చూసుకోవడానికి అక్కడున్న నంది మూతిని, కాలిని నరకగా అందులోనుండి రత్నాలు బయటపడ్డాయిట. ఒక జంతువు విగ్రహంలోనే ఇన్ని రత్నాలు వుంటే ఆలయంలో విగ్రహంలో ఎన్ని ఉన్నాయోనని ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయం కప్పుకూలి అతనిమీద పడి మరణించాడుట. ఇందుకు సాక్ష్యంగా  ఆ శిధిలాలు ఆలయం వెనక దర్శనమిస్తాయి . 

పంచారామాలకన్నా పురాతనమైనదని చెప్పబడే ఈ ఆలయంగురించీ, శక్తీశ్వరుని గురించీ, మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో 68 శ్లోకాలలో స్తుతించాడుట. భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు సల్పినట్లూ, మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఆ గ్రంధంలో స్పష్టంగా వుందిట. శ్రీనాధ మహాకవి వ్రాసిన కాశీఖండం కావ్యంలోకూడా ఈ ఆలయ ప్రశస్తి ఉన్నాడని పండితులు చెబుతూంటారు .

యనమదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయానికి ఇలా చేరుకోవచ్చు:
 వాయు మార్గం : 
ఆలయానికి చేరువలో 90 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి దేశీయ విమానాశ్రయం ఉన్నది. ఇక్కడికి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి యనమదుర్రు చేరుకోవచ్చు.
రైలు మార్గం : ఆలయానికి సమీపాన 5 కిలోమీటర్ల దూరంలో భీమవరం రైల్వే స్టేషన్ కలదు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, చెన్నై, కోల్కత్తా తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. 
రోడ్డు మార్గం : 5 కి.మీ ల దూరంలో ఉన్న భీమవరం సమీప బస్ స్టాండ్. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సులు వస్తుంటాయి.

 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi